కోర్టు ధిక్కరణ కేసు.. వారం రోజులు సామాజిక సేవ చేయాలంటూ అనంతపురం డీఈవోకు హైకోర్టు ఆదేశం

  • నోషనల్ సీనియారిటీ కల్పించే విషయంలో డీఈవో జాప్యం
  • బాధ్యుడిగా తేల్చిన న్యాయస్థానం
  • క్షమాపణ చెప్పిన డీఈవో
  • క్షమాపణ అంగీకరించాలంటే సామాజిక సేవ చేయాలన్న న్యాయస్థానం
కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కె.శామ్యూల్‌ను హెచ్చరించిన హైకోర్టు వారం రోజులపాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయమై 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశించినప్పటికీ సీనియారిటీ కల్పించకపోవడంతో గతేడాది ఆయన డీఈవోపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. నిన్న ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. న్యాయస్థానం ఆదేశాల అమల్లో ఏడాది జాప్యం చోటుచేసుకున్నందుకు డీఈవోను బాధ్యుడిగా తేల్చింది. దీంతో డీఈవో క్షమాపణ కోరారు. అయితే, క్షమాపణను అంగీకరించాలంటే వారం రోజులపాటు జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో కానీ, అనాథాశ్రమంలో కానీ సామాజిక సేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించారు. ఇందుకు డీఈవో అంగీకరించారు.

Anantapur District
DEO
AP High Court

More Telugu News